సైఫ్ అయినా, సంజయ్ అయినా వదిలిపెట్టం- కేటీఆర్

వరంగల్ కేఎంసీ పీజీ వైద్య విద్యార్ధిని ప్రీతి మృతిపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. ప్రీతి మృతి ఎంతో బాధాకరమని.. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. హనుమకొండ జిల్లాలో జరిగిన అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ ఈ ఘటనపై స్పందించారు.
‘కాలేజీలో ర్యాగింగ్ వల్ల డాక్టర్ ప్రీతి మృతి చెందడం బాధాకరం. ఆమె మృతికి కారకులైన నిందితులు సైఫ్ అయినా.. సంజయ్ అయినా సరే వదిలే ప్రసక్తే లేదు. ప్రీతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం, పార్టీ తరపున ఆదుకుంటామని హామీ ఇస్తున్నా’ అని అన్నారు. ప్రీతి ఘటనను కొందరు రాజకీయ చేస్తున్నారని మండిపడ్డారు. కళాశాలలో గొడవలు, ర్యాగింగ్ కారణంగా మనస్థాపానికి గురై.. ప్రీతి అనే వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందన్న కేటీఆర్.. అందుకు కారణమైన వాళ్లు ఎవ్వరైనా కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రీతి విషయం తెలిసి.. మంత్రులు, ఎమ్మెల్యేలంతా స్పందించారని.. విద్యార్థిని బతికించుకునేందుకు అన్ని విధాలుగా కృషి చేశామని కేటీఆర్ వివరించారు. దురదృష్టవశాత్తు.. ప్రీతి మరణించిందన్నారు. అయితే.. కొందరు మాత్రం ప్రీతి ఘటనపై రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. చిల్లర మల్లర మాటలతో.. మతం, కులం రంగు పులుముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిమ్స్ లో అయిదు రోజులపాటు మృత్యువుతో పోరాడి ప్రీతి మరణించిన సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి 9.10గంటలకు ఆమె మృతి చెందినట్టు నిమ్స్ వైద్యులు ప్రకటించారు. అయితే.. ప్రీతిది ఆత్మహత్య కాదని.. హత్య అని ఆమె తండ్రి ఆరోపించారు. ప్రిన్సిపాల్, హెచ్ఓడీలను సస్పెండ్ చేసి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
కేఎంసీలో పీజీ ఫస్ట్ ఇయర్ చదువుతోన్న ప్రీతి.. సీనియర్ వేధింపుల వల్ల ఆత్మహత్యకు యత్నించిన సంగతి తెలిసిందే. అయితే.. పాయిజన్ ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యకు యత్నించిన ప్రీతి.. సుమారు ఐదు రోజులుగా పాటు మృత్యువుతో పోరాడి నిన్న రాత్రి తొమ్మిది గంటల పది నిమిషాలకు తుది శ్వాస విడిచింది. ఈ విషయాన్ని నిమ్స్ వైద్యులు అధికారికంగా వెల్లడించారు. అయితే.. ప్రీతి మృతిపై తలిదండ్రులు, కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే.. పలువురు రాజకీయ నేతలు కూడా ప్రీతి ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన.. లవ్ జిహాదీలో భాగమేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ అమ్మాయిలను టార్గెట్ చేసి.. వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. బండి సంజయ్ చేసిన వాఖ్యలకు కౌంటర్ ఇస్తూ.. స్టేషన్ ఘన్‌పూర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *